తైపీ వేదికగా జరుగుతున్న ప్రఖ్యాత Computex 2026 టెక్ ఈవెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజం ఎన్విడియా (Nvidia) చరిత్రలోనే ఒక అతిపెద్ద సంచలన ప్రకటన చేసింది.
కేవలం గ్రాఫిక్స్ కార్డులకే పరిమితం కాకుండా, విండోస్ పీసీ మార్కెట్లోకి నేరుగా అడుగుపెడుతూ Nvidia RTX Spark అనే సరికొత్త సూపర్చిప్ను ఆ సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రపంచానికి పరిచయం చేశారు.
ఈ చిప్ కేవలం కంప్యూటర్ వేగాన్ని పెంచడానికి మాత్రమే కాదు, విండోస్ కంప్యూటర్లలో పర్సనల్ “ఏఐ ఏజెంట్స్” (AI Agents) సొంతంగా పనులను పూర్తి చేసేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
“గత 40 ఏళ్లుగా మీరు యాప్లను క్లిక్ చేస్తూ వచ్చారు. కానీ ఇకపై ఈ కొత్త పీసీలలో మీరు అడగడమే ఆలస్యం.. కంప్యూటరే ఆ పని పూర్తి చేస్తుంది” అని జెన్సన్ హువాంగ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ (RTX Spark) ప్రత్యేకతలు:
-
పవర్ఫుల్ ఆర్కిటెక్చర్: ఇందులో 20-కోర్ల ప్రాసెసర్ (Nvidia Grace CPU) మరియు అత్యంత శక్తివంతమైన బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ ఆధారిత గ్రాఫిక్స్ (Blackwell RTX GPU) ఉన్నాయి. దీని కోసం మీడియాటెక్ సంస్థతో ఎన్విడియా చేతులు కలిపింది.
-
భారీ ఏఐ సామర్థ్యం: ఇది 1 పెటాఫ్లాప్ (1 Petaflop) ఏఐ కంప్యూటింగ్ పవర్ను అందిస్తుంది. అంటే మీ కంప్యూటర్ లోపలే ఇంటర్నెట్ అవసరం లేకుండానే 120 బిలియన్ పారామీటర్లు గల పెద్ద ఏఐ మోడళ్లను రన్ చేయవచ్చు.
-
ర్యామ్ (RAM) సామర్థ్యం: ఈ చిప్ గరిష్టంగా 128GB వరకు అత్యంత వేగవంతమైన యూనిఫైడ్ మెమరీని సపోర్ట్ చేస్తుంది.
-
క్రియేటర్స్ మరియు గేమర్స్ కోసం: క్రియేటర్లు 12K వీడియో ఎడిటింగ్ మరియు భారీ 3D డిజైనింగ్ను కేవలం లాప్టాప్ బ్యాటరీపైనే చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే గేమర్స్ రే-ట్రేసింగ్ ఫీచర్తో అత్యధిక గ్రాఫిక్స్ గల గేమ్స్ను 1440p రిజల్యూషన్లో 100fps కంటే ఎక్కువ ఫ్రేమ్ రేట్తో ఆడవచ్చు.
స్మార్ట్ఫోన్ లాంటి విప్లవం: “సాధారణ మొబైల్ ఫోన్లు ‘స్మార్ట్ఫోన్’లుగా ఎలా మారాయో.. ఈ చిప్ రాకతో సాధారణ పర్సనల్ కంప్యూటర్లు కూడా ఒక Teammate లాంటి ఏఐ పీసీలుగా మారబోతున్నాయి.”
— జెన్సన్ హువాంగ్, ఎన్విడియా సీఈఓ.
మైక్రోసాఫ్ట్ మరియు ఇతర కంపెనీల భాగస్వామ్యం:ఈ కొత్త టెక్నాలజీతో మైక్రోసాఫ్ట్ సంస్థ సరికొత్త ‘సర్ఫేస్ లాప్టాప్ ఆల్ట్రా’ (Surface Laptop Ultra) ని ప్రకటించింది. ఇది మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యంత పవర్ఫుల్ లాప్టాప్గా నిలవనుంది.
అంతేకాకుండా, అడోబ్ సంస్థ తమ పాపులర్ సాఫ్ట్వేర్లు అయిన ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో లను ఆర్టీఎక్స్ స్పార్క్ చిప్కు అనుగుణంగా మొదటి నుండి సరికొత్తగా రీ-డిజైన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వీటిలో ఏఐ ఫీచర్లు రెండు రెట్లు వేగంగా పనిచేస్తాయి.
ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
ఈ ఆర్టీఎక్స్ స్పార్క్ చిప్తో పనిచేసే అత్యంత సన్నని (14mm), రోజంతా బ్యాటరీ లైఫ్ ఇచ్చే విండోస్ లాప్టాప్లు మరియు డెస్క్టాప్ కంప్యూటర్లు ఈ ఏడాది అక్టోబర్/నవంబర్ (Fall 2026) నాటికి మార్కెట్లోకి రానున్నాయి.
మైక్రోసాఫ్ట్తో పాటు Asus, Dell , HP , Lenovo, MSI వంటి ప్రముఖ కంపెనీలు ఈ ఏఐ కంప్యూటర్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి.
ఈ నిర్ణయంతో ఏఐ పీసీ రేసులో ఉన్న ఆపిల్, ఇంటెల్ మరియు క్వాల్కామ్ సంస్థలకు ఎన్విడియా గట్టి పోటీ ఇవ్వనుంది.
– బాచి






