గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది.
చిత్రాలయం స్టూడియోస్ అనే కొత్త నిర్మాణ సంస్థ – ప్రొడక్షన్ నంబర్ 1 – గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శనివారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది.
సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆశీస్సులతో గోపీచంద్ తన 32వ సినిమాను షురూ చేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్కు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు.
క్లాప్ ఇస్తున్న కె.రాఘవేంద్రరావు
ఈ సినిమా ద్వారా వేణు దోనెపూడి అనే కొత్త నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సినిమాపై ఉన్న మక్కువతో సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులతో చిత్రాలయం స్టూడియోస్ను స్థాపించినట్టు వేణు వెల్లడించారు.
గోపీచంద్ 32వ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన తాము.. రాబోయే రోజుల్లో పాపులర్ స్టార్స్తో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తామన్నారు. ఇక గోపీచంద్-శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిస్తున్న తమ తొలి సినిమాను విదేశాల్లోని మంచి లొకేషన్లలో చిత్రీకరిస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే, శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా వచ్చి ఐదేళ్లు అవుతోంది. వరుసగా ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటొని’ బాక్సాఫీసు వద్ద విఫలమవడంతో శ్రీను వైట్ల బాగా వెనకబడిపోయారు.
అయితే, ఇప్పుడు గోపీచంద్ కోసం ఆయన అద్భుతమైన కథను సిద్ధం చేశారట. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరో గోపీచంద్ను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించబోతున్నారని సమాచారం. అసలు ఇలాంటి పాత్రనే ఇప్పటి వరకు గోపీచంద్ పోషించలేదట.
శ్రీను వైట్ల సినిమాలు అంటే కామెడీకి పెద్దపీట వేస్తారు. ఆ ఫార్ములాను కొనసాగిస్తూనే తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారట శ్రీను వైట్ల. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు.
శ్రీను వైట్లతో గతంలో పలు విజయవంతమైన సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్.. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.






