రాష్ట్రంలోని కీలక నాయకులంతా ప్రజల్లోనే వుండాలని కాంగ్రెస్ అదిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకులు కూడా తెలంగాణలోనే తిష్టవేసి ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్దమవుతున్నారు.
నవంబర్ 15 నుండి 28 వరకు రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణలోనే వుండేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందట. దాదాపు 14 రోజులపాటు ఈ ఇద్దరూ రాష్ట్రం మొత్తాన్ని చుట్టివచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో వీరి పర్యటన వుండేలా తెలంగాణ కాంగ్రెస్ చూస్తోంది. ఇలా కేసీఆర్ కు ధీటుగా రాహుల్, ప్రియాంక లతో ఎన్నికల ప్రచార పర్వాన్ని నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఇక టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తెలగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలంగా వున్న స్థానాల్లో ప్రచార బాధ్యతలు అభ్యర్ధులకే అప్పగించి బలహీనంగా వున్నచోట్ల తాను ప్రచారం చేపట్టాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే రేవంత్ ప్రచారానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్దమవుతోందని తెలుస్తోంది.
ఇదిలావుంటే ఏ జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు ఆ జిల్లాలోని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు తీసుకోన్నారట.
ఇలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ల తమతమ జిల్లాల్లో ప్రచారం చేపట్టనున్నారు. ఇలా బిఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ కూడా ప్రచార జోరును పెంచాలని చూస్తోంది.






